మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు అరెస్ట్

శుక్రవారం, 7 జనవరి 2022 (11:55 IST)
అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తిలో హెల్త్ కేర్ క్లినిక్ నిర్మాణాన్ని అడ్డున్నందుకు ఇద్ద‌రు మాజీ మంత్రుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులను అరెస్ట్ చేసి  బుక్కరాయసముద్రం పోలీస్టేషన్ లో నిర్బంధించారు. పుట్టపర్తి బంద్ లో పాల్గొనేందుకు వెళుతుండగా, వారిద్ద‌రినీ ముందస్తు అరెస్టు చేశారు.
 
 
అమరావతి నుంచి వస్తున్న  ఇద్దరు నేతల వాహనాలను బుక్కరాయసముద్రం లో నిలిపివేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బుక్కరాయసముద్రం నుంచి అనంతపురం రూరల్ సమీపంలోని పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి తరలించారు. పుట్టపర్తిలో స్మశానంలో  హెల్త్ కేర్ క్లినిక్ ను  నిర్మిస్తున్న అందుకు నిరసనగా  పుట్టపర్తి బందుకు టిడిపి పిలుపునిచ్చింది. త‌మ‌ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సంఘ‌ట‌న‌ను ఖండించారు. ప్రజల సమస్యల కోసం పోరాడితే అరెస్టులా? మేము ప్రజాప్రతినిధులం ప్రజల కోసం శాంతి యుతంగా పోరాడే వ్యక్తులం కానీ  నక్సలైట్లం కాదన్నారు. ఈరోజు అమరావతి నుంచి తాడిపత్రి మీదుగా రోడ్డు మార్గాన అనంతపురానికి వస్తుంటే అరెస్టులు చేయ‌డం దుర్మార్గం అన్నారు.
 
పుట్టపర్తిలోని రుడ‌ద్రభూమిలో 3.36ఎకరాలలో 90 శాతంలో సమాధులు, 10 శాతం మాత్రమే మిగులు ఖాళీ భూమి ఉంటే  అందులో వై ఎస్ ఆర్ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణం చేపట్టడం సమంజసమా అని వైసీపీ ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి ని ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాద‌ని, అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ స్మశానవాటికలో ఎలాంటి నిర్మాణం జరగనివ్వం అన్నారు. మా ప్రాణాలు పణంగా పెట్టైనా దాన్ని అడ్డుకొని భూమిని ప్రజల కోసం ఉపయోగించుకొంటామ‌న్నారు.
 
 
భవిష్యత్ లో స్మశానవాటికలకు భూమి ఎంతో అవసరమ‌ని, అలాంటిది వైసీపీ నాయకులు కాసులకు కక్కుర్తి పడి సమాధుల్లో నిర్మాణం చేపట్టడం అవివేకం అన్నారు. తక్షణం అక్కడ నిర్మాణం ఆపాలని జిల్లా కలెక్టర్ ని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నామ‌ని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు