చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా హెల్త్ చెకప్.. ఎటిఎమ్ తరహాలో హెల్త్ కార్డు

మంగళవారం, 16 మార్చి 2021 (11:52 IST)
ప్రజల వద్దకే ఆరోగ్యం.. ప్రతి ఒక్కరికీ ఉచిత హెల్త్ చెకప్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వ విప్, తుడ చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంకల్పించారు. తన వ్యక్తిగత నిధులను వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇందుకు అనుగుణంగా అధికారులకు చంద్రగిరి ఎంపిడిఓ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ప్రజలకు ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం అతిపెద్ద ప్రహసనంగా మారిందన్నారు.

ఏ అనారోగ్యంతో మృతి చెందుతున్నారో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల్లో మార్పు రావాలని చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టానన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పుట్టిన బిడ్డ నుంచి పండు ముదసలి వరకు ప్రతి ఒక్కరికీ హెల్త్ చెకప్ చేయించనున్నట్లు వెల్లడించారు.

ఈ హెల్త్ చెకప్ కారణంగా ముందుగా శరీరంలో ఉన్న ఆనారోగ్యాన్ని గుర్తించి వైద్య సేవలు పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఇందుకు ఏటిఎమ్ తరహాలో హెల్త్ కార్డు అందిస్తామన్నారు.

నియోజకవర్గంలోని 2.5 లక్షల మందికి హెల్త్ చెకప్ లు చేయించనున్నట్లు తెలిపారు. అనంతరం అనారోగ్యాల దృష్ట్యా వారికి మెరుగైన వైద్యసేవలు అందించడం తో పాటు మందులు పొంది ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చని వివరించారు. 
 
ఆరోగ్య విభాగంలోని సిబ్బంది, అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన వారమవుతామని తెలిపారు. పాకాల నుంచి హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు