ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కెళ్లిన యువతి.. అత్యాచారం చేసిన తాగుబోతులు

గురువారం, 13 మే 2021 (07:47 IST)
కరోనా కష్టకాలంలోనూ అమ్మాయిలపై  అఘాయిత్యాలు ఆగడం లేదు. కరోనా వైరస్‌బారినపడి అనేక మంది మృత్యువాతపడుతుంటే... కొందరు కామాంధులకు మాత్రం ఇది చెలగాటంలావుంది. పైగా, తమ వికృత చేష్టలకు ఏమాత్రం స్వస్తి చెప్పడం లేదు. తాజాగా  స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై... మద్యం సేవించివున్న ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి రెండు వారాల క్రితం అల్లవరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది.
 
ఆ తర్వాత స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం తీరానికి వెళ్లింది. అప్పటికే అక్కడ సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం తాగిన మత్తులో ఉన్నారు. 
 
అలాగే సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. యువతీయువకులను చూసిన ఈ ముగ్గురూ వారిని సమీపించి యువకుడిపై దాడిచేసి బంధించారు.
 
అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి నగ్న ఫొటోలను తీసి వదిలిపెట్టారు. పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు యువతికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేదంటే తన వద్ద వున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. 
 
దీంతో భయపడిన బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు