వైకాపాలోకి గంట... తొలుత కుమారుడు... ఆ తర్వాత...

గురువారం, 1 అక్టోబరు 2020 (17:10 IST)
ఏపీలోని అధికార పార్టీలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు చేరబోతున్నారు. ఈ విషయం ఖరారైపోయింది. అయితే, ముందుగా ఆయన కుమారుడుకి వైకాపా తీర్థం ఇప్పించనున్నారు. ఆ తర్వాత తాను పార్టీలో చేరేలా ప్రణాళికలు రచించుకున్నారు. 
 
ప్రస్తుతం టీడీపీకి విశాఖపట్టణం జిల్లాలో గంటా శ్రీనివాస రావు కీలక నేతగా ఉన్నారు. ఈయన గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదేసమయంలో పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీనే గంటా వైకాపా తీర్థం పుచ్చుకోవాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఇది వాయిదాపడింది. 
 
ఇపుడు ఈ నెల మూడో తేదీన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కేకే రాజుకు పార్టీ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చినట్టు చెపుతున్నారు. 
 
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ గూటికి గంటా చేరనున్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నందున సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవడానికి... తన కుమారుడు రవితేజను తొలుత వైసీపీలో చేరుస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, గంటా శ్రీనివాస రావు తొలుత టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. అయితే, ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ హయాంలలో ఆయన మంత్రిగా పని చేశారు. ఇపుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన... అధికార వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు