వచ్చే ఏడాది మే నెల‌లో బంగారు తాపడం పనులు పూర్తి

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:07 IST)
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో సెప్టెంబరు 9వ తేదీ నుండి జరుగుతున్న బాలాలయ కార్యక్రమాలు సోమవారం సంప్రోక్షణంతో ముగిశాయి. 
 
 ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, 1972వ సంవత్సరంలో  ఆలయ విమాన గోపురం పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని 2018వ సంవత్సరంలో టిటిడి బోర్డు నిర్ణయించిందని చెప్పారు. రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, ఇందుకోసం 100 కిలోల బంగారం, 4300 కిలోల రాగి వినియోగిస్తున్నామని వివరించారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యధావిధిగా ఉంటుందని, కైంకర్యాలన్నీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తారని తెలియజేశారు. 
 
అంతకు ముందు ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, దివ్యప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. అనంతరం బాలాలయ సంప్రోక్షణం చేపట్టారు. మధ్యాహ్నం నిత్యకట్ల కైంకర్యం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ సదా భార్గవి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, ఎఫ్ఏసిఏఓ  బాలాజీ, విఎస్వో  మనోహర్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఆలయ ప్రధానార్చకులు  పి.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు  వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎఈవో ఎం.రవికుమార్రెడ్డి,  పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు