టి.స్పీకర్‌తో కేసీఆర్ భేటీ: చంద్రబాబుతో ఆనం భేటీ

శనివారం, 16 ఆగస్టు 2014 (14:27 IST)
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమావేశమయ్యారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీలో ఇరు రాష్ట్రాల నేతలకు ఛాంబర్ల కేటాయింపుతో పాటు బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
 
ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి సమావేశమయ్యారు. లేక్ వ్యూ అతిథి గృహంలో కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలసి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆనం సోదరులు ఎప్పుడైనా టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా ఏపీ, టీఎస్ స్పీకర్లకు గవర్నర్ నరసింహన్ హితబోధ చేశారు. పెద్దవాడ్ని చెబుతున్నా.. స్పీకర్లిద్దరూ కలిసి పనిచేయండయ్యా! అన్నారు. స్పీకర్లు ఇద్దరూ తనకు రెండు కళ్ల వంటివారని, రెండు కళ్లూ పనిచేస్తేనే దృష్టి బాగుంటుదని నరసింహన్ చెప్పారు. 
 
మీరిద్దరూ కలిసి పనిచేయాలని నా కోరిక, పెద్దవాడిని చెబుతున్నా, వినండి అని ఆయన రెండు రాష్ట్రాల స్పీకర్లకు హితబోధ చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ‘ఎట్‌ హోం' అల్పాహార విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు