గుజ్జనగుండ్ల హత్యకేసు నిందితుల అరెస్ట్, అక్రమ సంబంధమే అసలు కారణమా?

శనివారం, 20 మార్చి 2021 (16:59 IST)
గుంటూరు గుజ్జనగుండ్లలో జరిగిన రౌడీషీటర్ మంగరాజు (45) హత్య కేసులో నిందితులను పట్టాభిపురం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
 
తుఫాన్ నగర్ 2వ లైన్‌కు చెందిన అంగళకుర్తి మంగరాజు గతంలో ఒక హత్య కేసుతో పాటూ తాజాగా ఓ హత్యాయత్నం కేసులో తన కొడుకు పుల్లయ్య ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. అయితే హత్యాయత్నం కేసులో... పుల్లయ్య జైల్లో ఉండగా... మంగరాజు పోలీసుల కళ్ళుకప్పి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తుఫాన్ నగర్ ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళతో పుల్లయ్య అక్రమ సంబంధం కొనసాగిస్తున్న క్రమంలోనే జైలుకు వెళ్ళాడు.
 
దీన్ని అదనుగా భావించి గుజ్జనగుండ్ల బొడ్డురాయి ప్రాంతానికి చెందిన తుంగ గోపీ రాణికి దగ్గర అవ్వడంతో.... పుల్లయ్య తండ్రి అయిన హతుడు మంగరాజు గోపీనీ హత్య చేస్తానని బెదిరించాడు. అప్పటికే మంగరాజుకి శ్రీకృష్ణ దేయరాయనగర్ ప్రాంతానికి చెందిన జగన్నాథము వెంకటేశ్వర్లుతో పాత గొడవలు ఉన్నాయి.
 
ఈ క్రమంలో మంగరాజు వెంకటేశ్వర్లుతో పాటూ గోపీని హత్యచేస్తానని బెదిరించడంతో.... అతని కంటే ముందు తామే మంగరాజుని చంపాలని నిర్ణయించుకొని శ్రీకృష్ణ దేవరయనగర్‌కు చెందిన కొండేపాటి డేవిడ్ రాజు, కొండేపాటి ఏసుబాబులు (వీళ్ళిద్దరిపై ఇప్పటివరకూ ఎటువంటి కేసులు లేవు)ని కలుపుకొని మొత్తం నలుగురు నిందితులు ఈ నెల 18న గుజ్జనగుండ్ల సెంటర్లో మంగరాజుని కత్తి, కొడవలితో నరికి వెళ్ళిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపు మంగరాజు మృతి చెందడంతో పట్టాభిపురం పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసును ఛేదించడంలో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు