#HappyDussehra భారత సైనిక సంపత్తికి శస్త్ర పూజ చేసిన మంత్రి రాజ్‌నాథ్

ఆదివారం, 25 అక్టోబరు 2020 (13:40 IST)
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైనికులతో కలిసి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ నిర్వహించారు. ఇందుకోసం ఆయన చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సిక్కింలోని షిరాతంగ్ వెళ్లారు. అక్కడ భారత సైనిక సంపత్తికి శస్త్ర పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 
 
వాస్తవాధీన రేఖకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆయుధ పూజను నిర్వహించారు. ఆపై సైనికులతో పండగ చేసుకున్నారు. లడఖ్ రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి సంఘీభావంగా దేశమంతా నిలిచివుందన్న సంకేతాలను పంపేందుకే రాజ్‌నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇకపోతే, సుక్నా కేంద్రంగా ఉన్న 33 క్రాప్స్ హెడ్ కర్వార్టర్స్‌లో ఆయన భారత సైనిక ఆయుధ సంపత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారని సిక్కిం సెక్టార్ అధికారులు వెల్లడించారు. ఇక్కడి సైనిక దళాలను 'త్రిశక్తి'గా పిలుస్తారు. శనివారమే సిక్కిం చేరుకున్న రాజ్‌నాథ్‌కు అక్కడి సైనిక అధికారులు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు రాజ్‌నాథ్ పర్యటన సాగనుంది.
 
గత కొన్ని నెలలుగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకుని, దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో నిత్యమూ చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆయుధ పూజకు ఆ ప్రాంతాన్ని రాజ్‌నాథ్ ఎంచుకున్నారని సమాచారం. తన పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సైనికులను ప్రత్యేకంగా కలిసిన రాజ్‌నాథ్, వారికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు