పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా... కానీ, ఆ అవకాశం ఇపుడు లేదుగా...

ఠాగూర్

గురువారం, 4 ఏప్రియల్ 2024 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనివుందని సీనియర్ సినీ నటి జయప్రద అన్నారు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ మాజీ ఎంపీ తాజాగా తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. తనకు ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుందన్నారు. 'ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా కోరిక, అయితే, ఇదంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్డీయే అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కూడా ఉన్నట్టు జయప్రద పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
కాగా, జయప్రద ఏపీ నుంచి బరిలోకి దిగే అవకాశం తక్కువేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తులో ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లలో జనసేన తన అభ్యర్థులను బరిలో నిలిపింది. మే 13న ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు