పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు : ఓటరు కోరితే ఆ పని చేయాల్సిందే.. హైకోర్టు

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. ఈ క్రమంలో బుధవారం మరో దశ పోలింగ్ జరుగనుంది. ఈ క్రమలో పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ఓటరు కోరితే వీడియో తీయాల్సిందేనని ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆ ప్రక్రియను వీడియో తీయాలంటూ ఇటీవల ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వగా, ఆ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడం తెలిసిందే. కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ప్రతాప్ నాయక్ పిటిషన్లు వేశారు. 
 
ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీడియోగ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు అమలు కావడంలేదని, కనీసం మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓట్ల లెక్కింపును వీడియో తీసేలా ఆదేశించాలని కోరారు.
 
అలాగే, ఎస్ఈసీ తరపున హాజరైన న్యాయవాది అశ్వనీ కుమార్ వాదిస్తూ, వీడియో తీసే అంశంలో ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు రెండ్రోజుల తర్వాత సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉండడంతో అక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.
 
దాంతో జస్టిస్ సోమయాజులు ధర్మాసనం స్పందిస్తూ, సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఎలా వర్గీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ప్రశ్నించింది. తగిన వివరాలు అందించాలంటూ ఈ కేసును నేటికి వాయిదా వేసింది. దీనిపై మంగళవారం తీర్పునిచ్చింది. 
 
ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏ ఒక్క ఓటరు కోరినా, ఆ మేరకు వీడియో చిత్రీకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని హితవు పలికింది. 
 
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వీడియో తీయాలంటూ ఈ నెల 13న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని ఆదేశించింది. అదేసమయంలో, ఎన్నికలు పక్షపాతానికి తావులేకుండా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు