అజ్ఞాతంలో బోరుగడ్డ అనిల్ - విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు!

ఠాగూర్

శనివారం, 8 మార్చి 2025 (11:24 IST)
తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ తప్పుడు వైద్య సర్టిఫికేట్‌తో మధ్యంతర బెయిల్ పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఇపుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు, అతను విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు వీలుగా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీచేశారు. 
 
కాగా మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్ పారిపోయినట్టు వార్త వెలుగులోకి రాగానే గుంటూరు రాజేంద్ర నగర్, వేళాంగిణి నగర్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి చూడగా తలుపులు మూసివేసిన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు ఫోన్లు స్విచాఫ్ చేశారు. దీంతో వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో బోర్డుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదంటూ ఫిబ్రవరి 15వ తేదీన మధ్యంతర బెయిల్ పొందాడు. 28వ తేదీన జైలులో లొంగిపోయాడు. అయితే, ఆ తర్వాత మరోమారు మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 
 
తన తల్లికి సీరియస్‌గా ఉందని మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని పేర్కొంటూ గుంటూరులోని లలితా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ రాఘవశర్మ జారీచేసినట్టుగా మెడికల్ సర్టిఫికేట్‌ను జతపరిచాడు. దీంతో మార్చి 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అయితే, న్యాయస్థానానికి బోర్డుగడ్డ అనిల్ కుమార్ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీదని, దానిని తాము ఇవ్వలేదని డాక్టర్ వీపీ రాఘవశర్మ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేలా లుకౌట్ నోటీసులను కూడా పోలీసుల జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు