ఐదేళ్ళ బాలికపై అత్యాచారం.. కామాంధుడుకి 20 యేళ్ల జైలు

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ కామాంధుడికి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, నాలుగు వేల రూపాయల అపరాధం కూడా విధించింది. 
 
తాజాగా వెల్లడైన ఈ వార్త వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని గోల్కొండ నయాఖిలాకు చెందిన అజ్మత్‌ఖాన్ (26) అనే వ్యక్తి వెల్డర్‌గా పని చేస్తున్నాడు. కామంతో కళ్లుమూసుకు పోయిన అజ్మత్ ఖాన్.. గత 2018 జూలై 29వ తేదీన ఐదేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పగా, వారంతా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
ఈ కేసును విచారించిన నాంపల్లి మెట్రోపాలిటిన్ కోర్టు నేరం రుజువు కావడంతో 26 యేళ్ళ అజ్మత్ ఖాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు అదనంగా శిక్ష విధించాలని నాంపల్లి మెట్రోపాలిటిన్ న్యాయమూర్తి కె.సునీత ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు