ఏం కష్టమో.. నష్టమో... హైదరాబాద్‌లో యువ వైద్యురాలి బలవన్మరణం

శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (09:51 IST)
హైదరాబాద్‌లో ఓ యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ, తన ఆశల సౌథవాన్ని సమాధి చేసుకుంది. మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విశాఖపట్నం గాజువాకకు చెందిన మూగి అనూష (25) విజయనగరంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం ఉపాధిపై ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ ఓ ప్రైవేట్ కేన్సర్ ఆస్పత్రిలో పిజియోథెరపిస్టుగా చేరింది. అయితే, ఆమెకు ఎలాంటి కష్టం వచ్చిందో తెలియదు కానీ ఉరేసుకుని తనువు చాలించింది. 
 
మూడు రోజుల క్రితం మాదాపూర్‌ హైటెక్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న అతిథి హాస్టల్‌లో చేరింది. గురువారం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో సాయంత్రం 4.30 ప్రాంతంలో వసతి గృహం నిర్వాహకులు కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. 
 
4 నెలల క్రితమమే నగరానికి వచ్చిన ఆ యువతి.. అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మరణంతో తల్లి రాధావేణి కన్నీరుమున్నీరుగా విలపించింది. అనూషకు శిరీష అనే సోదరి ఉంది. ఆమెకు వివాహమైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి