ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ

బుధవారం, 7 ఆగస్టు 2019 (08:44 IST)
భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రధాన అజెండాగా సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటన చేపట్టారు. 
 
అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.  
 
మరోవైపు  వివాదాస్పదమైన పోలవరం కాంట్రాక్టుల రీటెండరింగ్ అంశం, పీపీఏల రద్దు వంటి అంశాలపై మోదీకి సీఎం జగన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థిక సహకారం, విభజన సమస్యల పరిష్కారంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనూ మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ లు సైతం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
 
ఇకపోతే అంతకు ముందుపీఎంవో కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శులతో జగన్ భేటీ అయ్యారు. పీఎంవో కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, అదనపు కార్యదర్శి పీకే శర్మలతో సుమారు 40నిమిషాలపాటు పలు కీలక అంశాలపై చర్చించారు.  
 
ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం సీఎం జగన్ లోక్ సభకు వెళ్లనున్నారు. లోక్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తొలుత మంగళవారం మధ్యాహ్నాం 2.30గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉంది. అయితే లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దుపై వాడీవేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కలిసేందుకు సమయం కుదరలేదు. 
 
ప్రధానికి జగన్‌ అందించిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు..
 
"ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. సామాజిక భద్రతను కల్పించేలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్దిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. పాదర్శకత, అవినీతి రహిత పాలనకోసం ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపట్టాం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలు. 
 
గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని విద్యుత్‌ రంగంలో అస్తవ్యస్త విధానాలు అనుసరించారు. అధిక ధరలకు సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి ముఖ్యంగా పవన విద్యుత్‌ కంపెనీల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
సంప్రదాయేతర విద్యుత్‌ కొనుగోలు పరిమితి 5–10శాతం ఉంటే, ఆ పరిమితిని దాటి 23.6శాతం వరకూ కొనుగోలు చేశారు.

దీనివల్ల ఏటా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.2,654 కోట్లు నష్టం. రోజూ రూ. 7 కోట్లు డిస్కంలు నష్టపోతున్నాయి. 
క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ను తప్పక ప్రోత్సహించాల్సి ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికోసం ఉద్దేశపూర్వకంగా గ్రిడ్‌ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారు. 
 
గత ఐదేళ్లలో అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్ల రూ.20వేల కోట్ల రూపాయల మేర ఉత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే ఛార్జీలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి. విభజన కారణంగా రాష్ట్ర ఆదాయాలకు గండిపడింది. 2014–15 నాటికి రూ.97వేల కోట్లు ఉన్న అప్పులు 2018–19 నాటికి రూ.2.58లక్షల కోట్లుకు చేరాయి. 
 
వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ.2100 కోట్లు అందాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదలచేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేబీకే తరహాలో మిగిలిన రూ.23,300 కోట్ల నిధులు ఇవ్వండి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువులను అనుసంధానం  కార్యక్రమానికి సహాయం చేయండి. 
 
గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవుపీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడానికి పూనుకున్నాం. దీనికీ సహాయం చేయండి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 
గోదావరిలో వరదజలాలను తరలించాల్సిన ఆవశ్యకత నెలకొంది. గోదావరి– కృష్ణా అనుసంధానానికి సహాయం చేయండి. 
 
రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇది పరస్పర ప్రయోజనకరం. ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ను తీసుకొస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్‌ ఏర్పాటు. దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి తగురీతిలో సహాయం అందించండి. 
 
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నాం. సెక్‌ డేటా సరిగ్గా లేకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. 
ఈ డేటా వల్ల కేవలం 10.87లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్‌ డేటాను సరిచేసి అర్హులైన వారందరినీ ఎంపికచేయాలి. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వండి. 
10 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి. 10ఏళ్లపాటు ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు ఇవ్వాలి. 10 ఏళ్లపాటు 100శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రియింబర్స్‌మెంట్‌ ఇవ్వండి. రెవిన్యూ లోటు రూపేణా రూ.22,948 కోట్లను పూడ్చాల్సిందిగా విజ్ఞప్తి. 

పోలవరం ప్రాజెక్టుకోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను రీయింబర్స్‌ చేయండి. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయండి.  కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఇది ఈ ప్రాంతానికి చాలా అవసరం. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశాం. దీనికి పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలి. 
 
దుగ్గరాజపట్నం వద్ద పోర్టును ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దుగ్గరాజ పట్నం పోర్టు ఏర్పాటు సాధ్యంకాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలంటూ నీతి ఆయోగ్‌ చెప్పింది. దీనికి బదులుగా రామాయపట్నంవద్ద పోర్టును నిర్మించాలి. 

రాజధాని నిర్మాణంకోసం రూ.2500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరుతాం" 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు