తిరుమల చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్

శనివారం, 16 నవంబరు 2019 (19:23 IST)
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి దేశ న్యాయవ్యవస్థలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్, పదవీ విరమణ పొందనున్న తరుణంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ప్రత్యేక విమానంలో దేశ రాజధాని నుండి శ‌నివారం సాయంత్రం తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు సంభందించిన న్యాయమూర్తులు, పరిపాలన అధికారులు సీజేఐ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి బయలుదేరిన ఆయన ముందుగా తిరుచానూరు ఆలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో సిజేఐ దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం పండితులు ఆశీస్సులు అందజేయగా టిటిడి జేఈఓ బసంత్ కుమార్ సీజేఐ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం శ్రీవారి దర్శనార్థం భారీ భద్రత నడుమ రోడ్డు మార్గంలో సీజేఐ తిరుమలకు బయలుదేరి శ్రీపద్మావతి అతిధిగృహం వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి సీజేఐ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకగా, భద్రతా సిబ్బంది గౌరవ వందనం చేసారు. ఇవాళ‌ రాత్రి అతిధిగృహంలో బస చేసి ఆదివారం ఉదయం సీజేఐ దంపతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు