చంద్రబాబు విడుదల కావాలని దుర్గమ్మను వేడుకున్నా : కె.అచ్చెన్నాయుడు

ఆదివారం, 22 అక్టోబరు 2023 (17:22 IST)
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కన్నకదుర్గమ్మను కేవలం రెండు విషయాలను కోరుకున్నట్టు చెప్పారు. ఒకటి అక్రమ కేసును బనాయించి నిర్బంధంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని, కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోరుకునే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు చెప్పారు. 
 
గత 44 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు విడుదల కావాలని, కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోలుకునే శక్తిని ఇవ్వాలని తల్లిని ప్రార్థించినట్టు చెప్పారు. చంద్రబాబు తెలుగు జాతి ఆస్తి అని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. తెలుగు పిల్లల ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని, తెలుగు జాతి ముందుండాలని భావించే వ్యక్తి అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే చంద్రబాబు వంటి వ్యక్తి జైల్లో ఉండకూడదని, ఆయన బయటికి వచ్చేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు వివరించారు.
 
ఇకపోతే, వందేళ్ల భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడనంత కరవు పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి తగిన నీళ్లు లేవని, పశుగ్రాసం కూడా లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కరవు బారి నుంచి ప్రజలు త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు