ఆయనకు ఇబ్బంది.. అందుకే ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారు.. కొడాలి నాని

శనివారం, 16 నవంబరు 2019 (14:29 IST)
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌కు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో.. ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారని ఏపీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారని కొడాలి నాని చెప్పారు. 
 
వాస్తవానికి లోకేశ్‌ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదని ఎద్దేవా చేశారు. కుమారుడు అయినందువల్లే నారా లోకేశ్‌ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని నాని మండిపడ్డారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, చంద్రబాబులా ఆయన ఏనాడూ సొల్లు కబుర్లు చెప్పలేదని తెలిపారు.
 
నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. టీడీపీకి ప్రజాధరణ తగ్గడానికి నారా లోకేష్, చంద్రబాబే  కారణమని ఆరోపించారు. ఇకనైనా పార్టీ పగ్గాలు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే టీడీపీ ఉనికి, అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
 
ఏపీ మాజీ మంత్రి లోకేశ్ దద్దమ్మ కాబట్టే అడ్డదారిలో పదవీ కట్టబెట్టారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు