అసైన్డ్ భూములను చంద్రబాబు కొన్నారా? ఇంటికెళ్లి నోటీసులిచ్చిన సీఐడీ!

మంగళవారం, 16 మార్చి 2021 (09:38 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులిచ్చింది. ఈ నోటీసులను ఆయన ఇంటికెళ్లి మరీ ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అసైన్డ్‌  భూముల కొనుగోలు, అమ్మకాలపై ఇటీవల కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసు విషయమై మంగళవారం ఉదయమే హైదరాబాద్‌లోని బాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
రెండు బృందాలుగా వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడా అధికారులు మాట్లాడినట్లు సమాచారం. ఎప్పుడు విచారణకు పిలిచినా తప్పకుండా హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారట. 
 
కేవలం చంద్రబాబు ఒక్కరే కాకుండా ఈ కేసులో ఉన్న దాదాపు ఎనిమిది మంది పేర్లను నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నోటీసులు ఇంకా ఏయే విషయాలను అధికారులు ప్రస్తావించారు..? నోటీసులు ఇచ్చిన సమయంలో చంద్రబాబు ఇంటో ఉన్నారా..? లేదా..? మిగిలిన ఆ ఎనిమిది మంది ఎవరు..? అనే విషయాలపై ఇంకా పూర్తిగా సమాచారం తెలియరాలేదు.
 
అయితే సీఐడీ ఎప్పుడు విచారణకు పిలుస్తుంది..? దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు స్పందిస్తూ నోటీసులు ఇచ్చేందుకే విజయవాడ నుంచి సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ సర్కార్ ఇలా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు