దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిద్దాం: మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:29 IST)
ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకూ జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలను వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేద్దామని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.

భక్తుల మనోభావాలు భంగంవాటిల్లకుండా దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని కోరారు. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లను కల్పించాలన్నారు. దర్శనానికి ప్రతిరోజూ 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు.

ఇందులో 4 వేలమందికి ఉచిత దర్శనం, 3 వేలమందికి రూ.100 దర్శనం, మరో 3 వేలమందికి రూ. 300 ల దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆన్లైన్లో టిక్కెట్లను తీసుకోవాలని భక్తులను కోరారు. ఇప్పటి వరకూ కేవలం 600 మంది భక్తులు మాత్రమే నమోదు చేసుకున్నారన్నారు. కోవిడ్ నేపథ్యంలో భవానీ దీక్ష నిర్వహించడానికి అనుమతి లేదన్నారు.

అయితే రాష్ట్రంలోని కలెక్టర్లకు ప్రత్యేక లేఖ వ్రాయమని ఆశాఖ కమిషనరు వాణిమోహన్ ను కోరారు. సోషల్ మీడియా ద్వారా భక్తులకు పార్కింగ్, క్యూలైన్, ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు అమ్మకం, తదితర విషయాలపై ప్రత్యేక వీడియోలు తీసి విస్తృతప్రచారం కల్పించాలని ఆలయ ఇఓ భ్రమరాంబను కోరారు.

భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించడానికి వీలులేదన్నారు. అయితే వారికోసం ప్రత్యేకంగా సీతమ్మపాదాలు వద్ద ప్రత్యేకంగా భక్తులు స్నానమాచరించేందుకు వాటర్ షవర్లను సిద్ధం చేస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు