చావు పరామర్శకు వెళ్ళి... లోకేష్ చేష్టలేంటి?

మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:00 IST)
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతి క‌లిగించింద‌ని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే, ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా, ఎవర్నీ ఉపేక్షించద‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

పక్క రాష్ట్రంలో ఓ మెడికోపై అఘాయిత్యం జరిగితే, ముఖ్యమంత్రి జగన్ స్పందించి, అసెంబ్లీలో దిశ బిల్లు చేసి, చట్టం కోసం కేంద్రానికి పంపించార‌ని తెలిపారు. అది చట్టమైతే ఇటువంటి ప్రేమోన్మాదులకు, అల్లరిమూకలకు మరింత వేగంగా శిక్షలు పడతాయ‌ని, రమ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశార‌ని అన్నారు.

పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంద‌ని, చంద్రబాబు కుమారుడుగా తప్పితే, ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడ‌న్నారు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే, ఓదార్చాల్సిందిపోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరమ‌న్నారు.

ముఖ్యమంత్రి జగన్ని వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాల‌న్నారు. నాయకుడు అంటే, జగన్ లా ఆదర్శంగా ఉండాలి తప్పితే.. చిల్లర రాజకీయాలు చేయకూడద‌ని అవంతి పేర్కొన్నారు. లోకేష్ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడు. అమెరికాలో చదివిన లోకేష్, ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాల‌న్నారు.

ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ, వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలి. లోకేష్ వచ్చిన తర్వాతే.. రాజకీయాల్లో ఇటువంటి బూతుల ట్రెండ్ ను కొత్త ట్రెండ్ గా తెచ్చాడ‌న్నారు.

యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా, నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేష్.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని, కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ, సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి?. పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా లోకేష్ చేష్టలు ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. ప్రతిదాన్నీ టీడీపీ రాజకీయం చేయాలని చూడటం తగదు.

దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకిగానీ, లోకేష్ కు గానీ లేదు. ఎవరైనా దళితులుగా పుడతారా.. అని మాట్లాడిన చంద్రబాబు దళితుల గురించి మాట్లాడటమా.. అని ప్రజలు నవ్వుకుంటున్నార‌ని అవంతి విమ‌ర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు