ప్రేమిస్తున్నాడనీ చెల్లి ప్రియుడిని హత్యచేసిన అన్న

బుధవారం, 13 మే 2020 (10:55 IST)
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రియురాలిని తనతో మాట్లాడనీయకుండా ఆమె అన్న నిర్బంధించాడని తెలుసుకున్న ప్రియుడు.. ప్రియురాలి అన్నను దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మచిలీపట్నం, స్థానిక అమృతపురం జెండా సెంటర్‌కు చెందిన యర్రంశెట్టి సాయి (21) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ యాసిన్‌కు మంచి స్నేహితుడు. దీంతో సాయి కోసం యాసిన్ తరచుగా ఇంటికెళ్లివచ్చేవాడు. ఈ క్రమంలో సాయి చెల్లితో యాసిన్‌కి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వారిద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ వచ్చారు. 
 
ఈ విషయాన్ని గుర్తించిన సాయి.. చెల్లితోపాటు.. యాసిన్‌ని కూడా హెచ్చరించాడు. అయితే, అన్న మాటలు పెడచెవిన పెట్టిన చెల్లి.. తన ప్రియుడు యాసిన్‌తో మాట్లాడుతూ వచ్చేది. దీంతో వారిద్దరికి పలుమార్లు గొడవలు జరిగాయి. పైగా, ప్రియురాలిని కలిసేందుకు సాయి అడ్డువస్తుండడంతో పగతో రగిలిపోయిన యాసిన్.. సాయిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
పార్టీ పేరుతో నిన్న ఆంధ్ర జాతీయ కళాశాల వెనకవైపు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి సాయిని పిలిపించాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో ముందుగా తెచ్చుకున్న సైనెడ్‌ను సాయి తాగే మద్యంలో కలిపాడు. విషయం తెలియని సాయి మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
ఆ వెంటనే యాసిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో యాసిన్ హత్య చేసినట్టు తేలడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు