జగన్‌కు, బాబుకు ఆ చక్రంతో ఒరిగిందేమీ లేదా? అందుకే సీఎం తీసేశారా?

శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:11 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసులో చోటుచేసుకున్న మార్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. అధికారులతో సమీక్షలు నిర్వహించే మీటింగ్ హాల్‌లో ముఖ్యమంత్రి కూర్చునే స్థానానికి వెనుక భాగంలో ఉండే బౌధ్ద ధర్మచక్రం స్థానంలో రాష్ట్ర అధికారిక చిహ్నం ఏర్పాటు చేయడమే. చక్రం వెనుక భాగంలో ఉండటం వల్ల అనవసర సమస్యలు ఉంటాయనే కారణంతోనే తీసేశారని ప్రచారం జరుగుతోంది. 
 
ఏపీ సీఎంవో షేర్ చేసిన ఫొటోల్లో జగన్ బ్యాక్‌గ్రౌండ్లో చక్రం ఉండగా.. బుధవారం నాటి సమీక్ష అనంతరం షేర్ చేసిన ఫొటోల్లో అధికారిక చిహ్నం కనిపించింది. జగన్ సర్కారు తీసేయించిన చక్రాన్ని చంద్రబాబు నాయడు ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేయించారు. అమరావతికి చిహ్నంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లపాటు దాన్ని అలాగే ఉండనిచ్చిన జగన్.. ఉన్నట్టుండి మార్చేయడం పట్ల టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. సీఎం మంచి పని చేశారని వైఎస్సార్సీపీ శ్రేణులు కితాబిస్తున్నాయి.
 
అయితే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన బాగా నమ్మే ఒక సిద్దాంతి సూచన మేరకు సీఎం కూర్చునే సీటు వెనుక పద్మంలాంటి ఆకారం ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతాయని అంతా మంచి జరుగుతుందని ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రివర్గ సహచరులు అంతర్గత చర్చల్లో చెప్పుకొచ్చారు. కానీ ఆ చక్రం చంద్రబాబుకు ఏమాత్రం మేలు చేయలేదనే వాదనా ఉంది.
 
అయితే ఈ చక్రం ఏపీ తాజా సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అంత మేలు చేయలేదనే చెప్పాలి. మూడు రాజధానుల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలు , ఆర్థికంగా తీవ్ర సంక్షోభం, కోర్టు నుంచి వరుస ఎదురు దెబ్బలు ఇలా ప్రతీ నిర్ణయం ఆదిలోనే నిలిచిపోతున్నాయి. దీనిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కోటరీలోని కీలక వ్యక్తులు తాము నమ్మే స్వామీజీలతో కారణాలు పరిష్కారాలపై చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.

ఫలితంగా ముఖ్యమంత్రి సీటు వెనక రోజూ కనిపించే బంగారపు రంగు చక్రం మాయమైంది. ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ చిహ్నం దర్శనమిచ్చింది. మరి ఆ చక్రం మార్చడం ద్వారా జగన్ చక్రం తిరుగుతుందా... ప్రభుత్వ పెద్దలు నమ్ముతున్న వాస్తు మార్పుతో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు