అల్లా ఆజ్ఞతో ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు: మంత్రి పేర్ని

శుక్రవారం, 30 జులై 2021 (18:22 IST)
అల్లా ఆజ్ఞ ప్రకారం ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు జరుగుతూనే ఉంటాయని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా అని ఏప‌నీ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య పేర్కొన్నారు.

శుక్రవారం మ‌చిలీప‌ట్నంలోని జవ్వారుపేటలో 400 ఏళ్ళ నాటి పురాతన  బీబీ ఫాతిమా జహ్రా ( ఖాతునే  క్యామత్ ) ఆస్తానా పంజా వ‌ద్ద  కమ్యూనిటీ సెంటర్ శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇస్లాం పరిపూర్ణమైన రోజు నేడని అందరికి  ఈద్ గధీర్ శుభాకాంక్షలు ముందుగా తెలియచేసారు.

ఇస్లామీయ ప్రవక్త ముహమ్మద్ కుమార్తె ఫాతిమా జహ్రా ప్రపంచంలోని  స్త్రీలందరికీ ఒక ఆదర్శమూర్తి గా నిలిచిపోయారని, ఆమె తన తండ్రియైన మహమ్మద్ ప్రవక్త ఆపత్కాలంలో ఉండ‌గా, ఆయన చెంతనే అనేక కష్టాలు సహిస్తూ తోడుగానే ఉన్నారని మంత్రి కొనియాడారు. అంతటి మహనీయురాలి పేరిట బీబీ ఫాతీమా జహ్రా ఆస్థాన పంజా పక్కనే నిర్మితమవుతున్న కమ్యూనిటీ సెంటర్ వేగవంతంగా పనులు జరిగేలా చూడాల‌ని మంత్రి పేర్ని నాని కోరారు.

బీబీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా సమీపంలోనే 400 స్థలం విక్రయానికి రావడం, చిన్నా పెద్దా  ధనిక పేద బేధం లేకుండా షియాలు అందరూ ఏకతాటిపై నిలిచి ఆ స్థలం కొనేందుకు  60 లక్షల రూపాయలు సేకరించి కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయడం వెనుక దైవశక్తి ఉందని  మంత్రి అన్నారు. కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి తన వంతు సహాయం తప్పక చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
 
ఈ కార్యక్రమంలో రషాద్ మౌలానా, అలీ అబ్బాస్, మీరాఖ్  అబ్బాస్, 26 వ డివిజన్ ఇంఛార్జ్ మాడపాటి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం మాజీ మునిసిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), కార్పొరేటర్లు మీర్ అస్గర్ అలీ, పరింకాయల విజయచందర్,  షేక్ సాహెబ్, మీర్ నజీఫ్ అలీ, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు