ముస్లీంల‌కు మంత్రి పేర్ని నాని శుభాకాంక్ష‌లు

బుధవారం, 21 జులై 2021 (12:56 IST)
పవిత్ర బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) శుభాకాంక్షలు తెలిపారు.

‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని అన్నారు. పవిత్ర ఇస్లామిక్ గ్రంధాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణత్యాగానికి బదులు ఓ జీవాన్ని బలివ్వాలని సూచిస్తారు.

అప్పటి నుంచి బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇందుకోసం బలిచ్చిన జీవాన్ని మూడు భాగాలుగా చేసి ఓ భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు.

ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతనమని, కుల మతాలకతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఇళ్ళ లోనే పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని, ఖుర్బానీలకు బదులుగా పేదలకు సాయం చేయాలని ముస్లిం మతపెద్దలు సైతం  పిలుపునిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు