జగనన్న ఇళ్లు కొత్త జంటలు శోభనం చేసుకునేందుకు కూడా పనికిరావు : వైకాపా ఎమ్మెల్యే

ఆదివారం, 27 జూన్ 2021 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పేదల కోసం జగనన్న ఇళ్ళను నిర్మిస్తోంది. ఈ ఇళ్ళపై అనేక రకాలైన కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ వైకాపాకే చెందిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్లు కొత్తగా పెళ్లయిన జంటలకు శోభనం చేసుకోవడానికి కూడా సరిపోనంత ఇరుకుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నెల్లూరులో జరిగిన హౌసింగ్‌ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'సార్‌... పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారు. చాలా బాగుంది. కానీ బెడ్‌రూం విషయానికి వస్తే పెళ్లయిన కొత్త జంటలకు శోభనం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 
 
చాలా చిన్న బెడ్‌ రూం. కొత్తగా పెళ్లయిన జంటలకే కాకుండా పాతవారికి కూడా నైట్‌ టైమ్‌ ఏదైనా పని చేసుకోవాలంటే ఇబ్బందే సార్‌. ఆ బెడ్రూంలో వేసే మంచం మనం కొలతలు తీసుకొని ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తే తప్ప సరిపోదు సార్‌. మార్కెట్‌లో అమ్మే ఫిక్స్‌డ్‌ సైజ్‌ మంచాలు ఆ బెడ్‌ రూంలకు చాలవు. నా విన్నపం ఏమంటే బాత్‌రూంలు బయట కట్టి, బెడ్‌రూం వెడల్పు చేస్తే బాగుంటుంది సార్‌. 
 
ఇక అర్బన్‌లో కట్టే ఇళ్ల విషయానికి వస్తే హాల్లో శోభనం చేసుకొని బెడ్రూంలో పడుకోవాల్సిందే సార్‌. ఇది చాలా అన్యాయం సార్‌. అర్బన్‌లో 6 అంకణాల్లో(ఒక సెంటు) ఇల్లు కడుతున్నారు. ఎంత ఇల్లు వస్తుంది చెప్పండి సార్‌. గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేవిధంగా అర్బన్‌లో కూడా తొమ్మిది అంకణాల్లో (ఒకటిన్నర సెంటు) ఇల్లు కట్టిస్తే బాగుంటుంది సార్‌' అని ప్రసన్నకుమార్‌ రెడ్డి జగనన్న ఇళ్ల సౌందర్యాన్ని తనదైనశైలిలో వ్యంగంగా వివరించడంతో తోటి శాసన సభ్యులు, అధికారులు నవ్వుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు