మహానాడులో మంత్రి లోకేష్ ఏం మాట్లాడారు... అహ ఏం మాట్లాడారా అని?

మంగళవారం, 29 మే 2018 (14:32 IST)
వచ్చే ఎన్నికల్లో బిజెపికి రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే… ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌ మాత్రం రానున్న ఎన్నికల్లో బిజెపినే తమ ప్రధాన ప్రత్యర్థి అని అంటున్నారు. ఈ రెండు మాటలూ మహానాడు వేదికపైన మాట్లాడినవే. ఒక్కశాతం ఓట్లు కూడా రాని బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయితే…. మరి వైసిపికి ఎన్ని ఓట్లు వస్తాయి? పవన్‌కు, కాంగ్రెస్‌కు, వామపక్షాలకు ఎన్ని ఓట్లు వస్తాయి? ఈ లెక్కన ఓట్లన్నీ టిడిపికే వస్తాయన్నమాట. 
 
లోకేష్‌ మాట్లాడిన మాటల్లో ఎక్కడా లాజిక్‌ లేదనే చర్చయితే సాగుతోంది. వైసిపి ఐసియులో ఉందని, దానికి బిజెపి ఆక్సిజన్‌ అందిస్తోందని చెప్పారు. ఆ వెంటనే వైసిపికి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని అన్నారు. అదేవిధంగా బిజెపి సొంతంగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను తెస్తోందని మరోమాట అన్నారు. 
 
లోకేష్‌ ఉపన్యాసంలో ఈ గందరగోళం ఏమిటో అర్థంకావడంలేదంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వైసిపి, బిజెపిలను విమర్శించే క్రమంలో లోకేష్‌ గందరగోళానికి గురవుతున్నారని అంటున్నారు. లోకేష్‌ చెప్పింది నమ్మాలంటే చంద్రబాబు చెప్పింది తప్పవుతుంది. చంద్రబాబు చెప్పింది సరైనదైతే లోకేష్‌ మాటలు అసంబద్ధమవుతాయి. ఉపన్యాసాల్లో లోకేష్‌కు ఇంకా శిక్షణ అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు