విజయవాడ, ఇబ్రహీంపట్నంలో వైకాపా కార్యకర్తల పైశాచికత్వంపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించినా, ఛీకొట్టినా వాళ్ల తీరు మారలేదన్నారు. మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి, వాళ్లు చేసిన పిచ్చి చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట శుభకార్యానికి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆ మార్గంలో వెళుతున్న ఓ బాలుడు సైకిల్ను బలవంతంగా లాక్కొని దారుణంగా ప్రవర్తించారు. సైకిల్ను గాల్లో తిప్పి నేలకేసి కొట్టి, కాళ్ళతో తొక్కుతూ పైశాచికానందం పొందారు. ఓ పక్క ఆ పిల్లవాడు ఏడుస్తున్నా పట్టించకోకుండా దుశ్చర్యకు పాల్పడ్డారు.
దీనిపై లోకేశ్ స్పందిస్తూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. "అబ్బే.. వాళ్లేమీ మారలేదు. మారరు కూడా. ఏ ముహుర్తాన సైకో అని పెట్టామో... ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ.. నేటికీ ఎప్పటికీ అదో సైకో పార్టీ. వాళ్లకి సైకో నాయుకుడు. ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను, చిన్నపిల్లవాడి చేతి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత అర్థం చేసుకోవాలని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు.