వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్లు అధికార మదంతోనే వరుస కేసులు బనాయిస్తున్నారని వైకాపా మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వంశీ నాని అరెస్టు, రిమాండ్పై ఆయన స్పందించారు. వల్లభనేని వంశీపై ఒక కేసు తర్వాత మరొకటి బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. ఈ కారణంగానే 115 రోజులుగా వంశీని కూటమి పెద్దలు ఉద్దేశపూర్వకంగా జైలులో ఉంచారన్నారు. అధికార మదం చూపించుకోవాలనే వంశీపై తప్పుడు ఆలోచనలతో కేసుల మీద కేసులు పెట్టారన్నారు. 14 యేళ్ల క్రితం వంశీ తనను అన్యాయం చేశారని ఒకరు, 9 యేళ్ల క్రితం వంశీ తనను అన్యాయం చేశారని మరొకరు ఒక కేసు తర్వాత మరొక తప్పుడు కేసు బనాయిస్తున్నారన్నారు.
దేవుడున్నాడు.. న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందన్న ఆశతో ఉన్నామన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరకు న్యాయం దొరుకుతుందని పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు, లోకేశ్ మానవత్వాన్ని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యం క్షీణించి వంశీకి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు, లోకేశ్ యముని పాత్రలో ఉంటే సతీ సావిత్రిలా వంశీని ఆయన అర్థాంగి కాపాడుకుంటోందని అన్నారు. న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోందని పేర్ని నాని అన్నారు. వంశీ జైలు నుంచి విడుదల కావడం ఖాయం.. గన్నవరంలో ప్రతి గడపకు వెళ్లడం జరుగుతుందని, గన్నవరం నియోజకవర్గానికి వంశీనే నాయకత్వం వహిస్తారని పేర్ని నాని జోస్యం చెప్పారు.