న్యూ ట్విస్ట్ : డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు

బుధవారం, 3 జూన్ 2020 (14:36 IST)
డాక్టర్ సుధాకర్ కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ.. డాక్టర్ సుధాకర్‌పై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మాట తూలడం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్ సైట్లో ఉంచింది.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీబీఐ... డాక్టర్ సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇపుడు డాక్టర్ సుధాకర్‌పై కూడా కేసు నమోదు చేయడంతో ఈ కేసు రసవత్తరంగా మారింది. 
 
పోలీసులపై సీబీఐ నమోదు చేసిన కేసులో కావాలని తిట్టడం, కుట్ర కోణం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి. ఇపుడు సుధాకర్‌పై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, నర్సీపట్నం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియాగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్... కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఎన్95 మాస్కులు ఇవ్వలేదంటూ మీడియా ముందుకు రావడంతో ఆయనపై ఏపీ సర్కారు సస్పెండ్ వేటు వేసింది. ఆ తర్వాత వైజాగ్ పోలీసులు డాక్టర్ సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించి, పిచ్చాసుపత్రిలో చేర్పించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు