జనసేనకు సీటు ఇవ్వాల్సిందే, భీష్మించుకు కూర్చున్న పవన్

సోమవారం, 25 జనవరి 2021 (23:01 IST)
తిరుపతి ఉప ఎన్నికపైనే ఇప్పుడి అందరి ఆసక్తి. బిజెపి - జనసేన కలిసి ఉండడం.. ఆ పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో చర్చ మరింతగా జరుగుతోంది. తెలుగుదేశం తరపున అభ్యర్థిని ప్రకటించి ఇప్పటికే ప్రచారంలోకి వెళ్ళారు. ఇక వైసిపి ఒక అభ్యర్థిని నిర్ణయించుకుంది కానీ ఆ అభ్యర్థి పేరును మాత్రం ఖరారు చేయలేదు. కానీ అతనే కన్ఫామ్ అని నేతలే చెప్పుకుంటున్నారు.
 
ముందు నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి తరపున అభ్యర్థే పోటీ చేస్తాడని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే జనసేన పార్టీ నేతలు మాత్రం అది బిజెపి నిర్ణయం మాత్రమేనని ఇంకా ఎవరిని కన్ఫామ్ చేయలేదన్నారు. ఇప్పటికీ సీటు కోసం మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు.
 
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో బిజెపి ముఖ్య నేతల ముందు కుండబద్ధలు కొట్టేశాడు. జనసేన పార్టీ నుంచే అభ్యర్థిని నిలబెడతామన్నారు. ఈ సమావేశంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌లు కూడా ఉన్నారు. 
 
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సీటు జనసేనకే ఇవ్వాలంటూ చెప్పడం.. ఆ మాటకే కట్టుబడి ఉండాలని బిజెపిని కోరడం జరిగింది. గతంలో దుబ్బాక నుంచి హైదరాబాద్ ఎన్నికల వరకు ఎప్పుడూ అభ్యర్థి విషయంలో అడ్డుచెప్పని పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఈ నిర్ణయం తీసుకోవడంపై బిజెపి నేతలే ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతానికి సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారే తప్ప ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ను ఎలాగోలా ఒప్పించి బిజెపి తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట బిజెపి ముఖ్య నేతలు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు