జనసేనాన్ని జనవాణి కార్యక్రమం - విజయవాడ నుంచి ప్రారంభం

బుధవారం, 29 జూన్ 2022 (11:53 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పాలన పనితీరును ఎండగట్టేలా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండేలా జనవాణి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి విజయవాడ నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ  కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. 
 
ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా ఈ జనవాణి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్టు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ స్వయంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. 
 
ఆ అర్జీలను సంబంధిత అధికారులకు ఆయన పంపించనున్నారు. ఆ తర్వాత ఆ అర్జీలపై జనసేన కార్యాలయం నుంచి అధికారులను సంప్రదిస్తూ ఆరా తీస్తుంటారు. ఇకనుంచి ప్రతి ఆదివారం ఈ జనవాణి కార్యక్రమం ఉంటుందని, తొలి రెండు కార్యక్రమాలు మాత్రం విజయవాడలోనే జరుగుతాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు