వైఎస్ఆర్ సీపీ గుర్తింపును రద్దు చేయండి : ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ (video)

శుక్రవారం, 10 జులై 2020 (18:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అన్నా వైఎస్ఆర్సీపీ నేత బాషా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి బదులుగా వైయస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిష‌న్‌లో ఆయన పేర్కొన్నారు.
 
మరోవైపు ఇదే పేరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వైయస్ఆర్సీపీ పేరుపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ పేరుతో తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ ప్రశ్నించారు. ఇదే అంశాన్ని ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు. 
 
ఇదిలావుండగా, వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో తనపై నమోదవుతున్న కేసులను కొట్టివేయాలంటూ ఆయన పిటిషనులో కోరారు. 
 
ఇటీవల రఘురామకృష్ణరాజు తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రులు మంత్రి శ్రీరంగనాథరాజు, వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకటనాగేశ్వరావు, ముదునూరి ప్రసాద్ రాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు