ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. 16వ నంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన డ్రైన్లో ఫ్లెక్సీలు చుట్టి ఉంచిన మృతదేహం ఒకటి బుధవారం ఉదయం మంటల్లో కాలుతూ కనిపించింది. దీనిపై సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. అప్పటికే మృతదేహం చాలా భాగం కాలిపోయింది.
నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వర రావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారాయడు, యడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య చేసి మృతదేహాన్ని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు.