పవన్‌వి స్థిరత్వం లేని నిర్ణయాలు.. ఊసరవెల్లిలా మారిపోయారు : ప్రకాష్ రాజ్

శుక్రవారం, 27 నవంబరు 2020 (20:10 IST)
హైదరాబాద్ నగర మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరినీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయ్యాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెబుతుండటాన్ని సహచర నటుడు ప్రకాష్ రాజ్ తప్పబట్టారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వెయ్యాలని చెపుతుంటే.. ఇక జనసేన పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని భావించింది. ఆ తర్వాత బీజేపీ కీలక నేతల సమావేశం తర్వాత పవన్ మనస్సు మార్చుకున్నారు. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జనసేన సైనికులతో పాటు ఇతరులు కూడా బీజేపీకి ఓటు వేయాలని కోరారు. 
 
ఈ నిర్ణయాన్నే ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభిమానులను, కార్యకర్తలను అందరినీ బీజేపీకి ఓటేయాలని చెబుతుంటే, ఇక జనసేన పార్టీ ఎందుకని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సొంత పార్టీ ఉన్న పవన్ కల్యాణ్ మరో పార్టీకి ఓటేయాలని చెప్పడం ఏంటో తనకు అర్థం కావడంలేదన్నారు. 
 
'పవన్ ఓ పార్టీకి నాయకుడు... అలాంటప్పుడు తన పార్టీకి ఓట్లు అడగకుండా, మరో నాయకుడి వైపు వేలు చూపించి అతనికే ఓట్లు వేయాలని చెప్పడమేంటి? పవన్ కల్యాణ్‌కు అసలేమైందో అర్థంకావడంలేదు. స్థిరత్వంలేని నిర్ణయాలతో ఊసరవెల్లిలా మారిపోయారు. 2014లో పవన్ బీజేపీని పొగిడారు. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్లను ద్రోహులని లెఫ్ట్ పార్టీలతో కలిశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లతో కలిశారు. ఇలా పూటకో మాట మార్చుతుంటే ఇంకేమనాలి?
 
జాతిహితం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలంటున్నాడు. సొంత పార్టీ జనసేనను వదిలేసి మరో పార్టీ కోసం పనిచేయడం ఏంటో అర్థంకావడంలేదు. మరొకరి భుజాలపైకి ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు?" అంటూ నిశిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కేసీఆర్‌లా అవ్వాలంటే బీజేపీ వాళ్లు వెయ్యి జన్మలెత్తాలని, ఈసారి కేసీఆర్ బిజీగా ఉన్నారని, అందుకే ప్రజలే బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు