అమృత తండ్రి మామూలోడు కాదు.. ఐసిస్ ఉగ్రవాదితో లింకులు...

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (12:18 IST)
మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ పరువుహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్‌ని హత్య చేయించేందుకు నిర్ణయించుకున్న మారుతీరావు, గుజరాత్ మాజీ హోమ్ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో జైలు శిక్షను అనుభవించి విడుదలైన ఉగ్రవాది మహ్మద్ బారీతో కలసి డీల్ కుదుర్చుకున్నాడు. ఈయనకు ఐసిస్ ఉగ్ర సంస్థతో లింకులు ఉన్నాయి.
 
ఈ మహ్మద్ బారీకి కాంగ్రెస్ పార్టీ నేత ఎండీ కరీమ్ ఆశ్రయం ఇచ్చాడు. ప్రస్తుతం బారీ హైదరాబాద్‌లో ఉంటుండగా, కరీమ్ ఇచ్చిన ఆఫర్‌తో పాతబస్తీకి చెందిన ఓ రౌడీషీటర్‌తో ఈ హత్యను బారీ చేయించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. 
 
ఐదారేళ్ల క్రితం భూ కబ్జా వివాదంలో బారీ మిర్యాలగూడకు వచ్చిన వేళ, మారుతీరావు కలుగజేసుకుని సయోధ్య చేశాడని, అప్పటి పరిచయమే, ఈ హత్యకు అతని సాయాన్ని కోరేలా చేసిందని పోలీసులు వెల్లడించారు. 
 
హత్యకు ప్లాన్ చేసిన తర్వాత బారీకి కరీమ్ ఆశ్రయం ఇచ్చాడని, డబ్బులు కూడా కరీమ్ ద్వారానే బారీకి అందాయని, వీరితో పాటు రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
తీవ్ర కలకలం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యకేసులో ఏ1 నిందితుడు మారుతీరావు, అతని సోదరుడు, ఇదే కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న శ్రవణ్‌లది ఆది నుంచీ నేరచరిత్రేనని తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడలోని ఓ లాడ్జిలో నీలిచిత్రాలను శ్రవణ్ చిత్రీకరిస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.
 
అదేసమయంలో ఓ చిన్న స్కూటర్‌పై నగరంలో తిరుగుతూ, మారుతీరావు కిరోసిన్ దందా చేస్తుండేవాడు. అనంతర కాలంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని, డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, వాటిని తన పేరిట మార్చుకుంటూ, కబ్జాదారుడిగా మారి కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు