కర్నూలు జిల్లాలో వింత ఆచారం : గాడిదలకు పెళ్లి

గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:44 IST)
Donkey Marriage
వానల కోసం చాలా ప్రాంతాల్లో ప్రజలు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. కప్పదాట్లు, జంతువులకు పెళ్లి చేయడం వంటి పూజలు నిర్వహిస్తుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం వెలుగు చూసింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అక్కడి ప్రజలు గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పత్తికొండ మండలం.. హోసూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సకాలంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామస్థులు వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇందులో బాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. 
 
అనంతరం ఊరేగింపు నిర్వహించారు. హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే గాడిదలకు పెళ్లి చేశారు. 
 
ఈ గాడిదల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ పెళ్లి చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం చేస్తున్న వీరి ప్రయత్నం వింతగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ.. ఈ మూఢ నమ్మకాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఎవరి విశ్వాసాలు వారివి అంటూ గ్రామస్తుల చర్యను సమర్థిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు