గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ పి సిసోడియా

సోమవారం, 23 ఆగస్టు 2021 (14:51 IST)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్ పి సిసోడియా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. తొలుత గవర్నర్ తో సమావేశం అయిన అనంతరం రాజ్ భవన్ లోని తన ఛాంబర్ లో సిటిసిపై సంతకం చేసారు.

రాజ్ భవన్ లోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి ఏ అధికారి  స్దానం ఎక్కడ , వారి విధులు ఏమిటి అన్న దానిపై సమాచారం తీసుకున్నారు. అనంతరం రాజ్ భవన్ అధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. రాజ్ భవన్ విధి విధానాలను గురించి అధికారులు సిసోడియాకు వివరించారు.

ఈ సందర్భంగా సిసిడియా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ కు సంబంధించి రాజ్యాంగ బద్దమైన ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు కృషి చేస్తానన్నారు. సాధారణ ఉద్యోగి మొదలు ఉన్నత స్దాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేయటం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుతామన్నారు. 
 
1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సిసోడియా  ప్రభుత్వం ఇటీవల జరిపిన సాధారణ బదిలీలలో భాగంగా రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.  ప్రస్తుతం సిసోడియా కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ గా కీలక బాధ్యతలలో ఉన్నారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. 
 
 రాజస్దాన్ కు చెందిన సిసోడియా జంతు శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం అఖిల భారత సర్వీస్ కు ఎంపికయ్యారు. సమైఖ్య రాష్టంలో హైదరాబాద్ నగర పాలక సంస్ధ అదనపు కమిషనర్ గా, నల్గొండ జిల్లా కలెక్టర్ గా, ఈ సేవ విభాగం సంచాలకులుగా, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించారు. ఉద్యానవన శాఖ కమీషనర్ గా, మానవ వనరుల అభివృద్ది సంస్ధ సంచాలకులుగా విశేష గుర్తింపు గడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

అనంతరం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య రాజకీయ కార్యదర్శిగా ప్రదాన భూమిక పోషించారు. మరో వైపు కేంద్ర సర్వీస్ లో సైతం క్రియాశీలకంగా వ్యవహరించిన సిసోడియా కేంద్ర ఉన్నత విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి గా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు