ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ డిప్యూడీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమన్నారు.
రఘురామ కృష్ణం రాజు మంగళవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, "రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు" అన్నారు.
"నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైసీపీ నేతల అదృష్టం" అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.