విద్యా వ్యవస్థ లో సంస్కరణలు.. విద్యాశాఖ మంత్రి సురేష్

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (20:55 IST)
విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామని, ఫీజుల నియంత్రణ, విద్యా నవరత్నాల అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

విద్యా వ్యవస్థలో బలహీనతలు, బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై బెంగుళూరు లో సోమవారం 6వ ఆసియన్ సమ్మిట్ జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి రాష్ట్రం లో విద్యా వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలను వివరించారు.

నైపుణ్యాభివృద్ధి కి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,  ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఫీజు నియంత్రణ కోసం కొత్తగా రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేశామని గతం లో ఎప్పుడూ రాష్ట్రం లో ఇటువంటి వ్యవస్థ లేదన్నారు.

ఉపాధ్యాయుల సామర్ధ్యం పెంపొందించే కార్యక్రమాలు, పాఠశాలకు పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పేరుతో బృహత్తర కార్యక్రమం చేపట్టిన వైనం సదస్సు లో వివరించారు. పాఠశాలల్లో సాంకేతిక అంశాలు, ఈ -హాజరు, డిజిటల్ తరగతి గదులు, నో బాగ్ డే, కెరీర్ కౌన్సిలింగ్ తదితర అంశాలపై వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో బాలికలను ప్రోత్సహించేందుకు  బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా సాంకేతిక బయో టెక్నాలజీ మంత్రి అశ్వత్ నారాయణ, థాయిలాండ్ ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి ఖున్ ఇంగ్ కలయా సోఫోన్ పానిచ్ మరియు ఇతర రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు