చంద్రబాబుకు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు : సజ్జల రామకృష్ణారెడ్డి

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:04 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి తన మనసులోని మాటను వెల్లడించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏమైనా అయితే తమకెలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. 
 
ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగడం సహా బెదిరింపులకూ పాల్పడుతున్నారని.. ఆయన మాటలకు బాధపడి ఎవరైనా ప్రతిస్పందిస్తే తమకు సంబంధం లేదన్నారు. 
 
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓటమిపాలైనప్పటి నుంచి చంద్రబాబుకు వయసు పెరగడం వల్ల వచ్చిన మార్పులు.. ఇతర కారణాలతో వ్యక్తిగత దూషణకు దిగుతూ జుగుప్సాకరమైన భాషను ప్రయోగిస్తున్నారన్నారు. 
 
ముఖ్యంగా, విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందపైనా ఇష్టారీతిన మాట్లాడారని ఆక్షేపించారు. ఆయన హత్యా రాజకీయాలు నడుపుతున్నారని.. సీఎం జగన్‌ ఆయన పీఠానికి వెళ్తుంటే.. ఐఏఎస్‌లూ, ఐపీఎస్‌లూ అక్కడకే వెళ్తున్నారని.. ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 
 
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన సందర్భంగా.. వైసీపీ ముఖ్యనేతలపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా బెదిరింపులకు దిగుతున్నారని.. ఇదే భాషను ఉపయోగిస్తే.. ఎవరికైనా బాధ కలిగి ప్రతిస్పందిస్తే ప్రభుత్వానికేమీ సంబంధం ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు