ఏపీలో లాక్‌డౌన్.. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందే: సజ్జల

శనివారం, 1 మే 2021 (19:21 IST)
ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ.. ఏపీలోలాక్ డౌన్ విధించే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా మారగా.. లాక్‌డౌన్‌ పెడితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోతుందని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సజ్జల చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని, ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
 
దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి జగన్ పాలన ఉందని సజ్జల తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, సీఎం తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. లాక్‌డౌన్ ఇప్పట్లో లేనట్లే అన్నట్లుగా సజ్జల మరోసారి క్లారిటీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు