పవన్ వీరాభిమాని బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు

గురువారం, 11 జనవరి 2018 (17:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే, ఆయన సోదరుడు శివబాబుపై కూడా ఈ సెక్షన్ ప్రయోగించారు. తమకు రావాల్సిన డబ్బులను ఇవ్వాలని అడిగినందుకు కులం పేరుతో తమని దూషించారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 
 
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కి చెందిన డాక్టర్ దిలీప్‌చంద్ర‌కి ఫరూఖ్‌నగర్ మండలం, బూర్గుల శివారులో భూముల, పౌల్ట్రీలు ఉన్నాయి. వీటన్నింటినీ బండ్ల గణేష్ కొనుగోలు చేసేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే, ఆ భూములపై బ్యాంకుల్లో అప్పటికే రుణాలు ఉండటంతో వాటిని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒప్పందం‌లో స్పష్టంగా పొందుపరిచారు. 
 
అయితే సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ భూములతో పాటు దిలీప్ చంద్ర ఇంటిని కూడా సీజ్ చేశారు. అనంతరం బండ్ల గణేశ్ సోదరుల ద్వారానే ఆ ఆస్తులన్నింటినీ విక్రయించారు. విక్రయించిన తర్వాత వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈనేపథ్యంలో డాక్టర్ దిలీప్ చంద్ర, తన భార్య కౌన్సిలర్ కృష్ణవేణి‌తో కలిసి గణేశ్ పౌల్ట్రీ ఫాం కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ గణేశ్, శివబాబు తమని దూషించారంటూ కృష్ణవేణి‌ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్‌ సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు స్థానిక ఏసీపీ సురేందర్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు