షుగ‌ర్ వ్యాధి సామాన్య‌మైన‌ది కాదు... చికిత్స‌కు రాయితీలివ్వాలి!

సోమవారం, 29 నవంబరు 2021 (10:18 IST)
సామాజిక అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే సీజే ఎన్వీ ర‌మ‌ణ‌, ఈసారి సుగుర్ వ్యాధిపైనా స్పందించారు. మధుమేహం ఖరీదైన వ్యాధిగా మారింద‌ని, దీని చికిత్స, మందులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. ఇది ధనికులకు వచ్చే వ్యాధి అన్న అపోహ ప్రజల్లో ఉందని, కానీ వాస్తవంగా ఇది పేదవారి శత్రువు అని అభివర్ణించారు. 
 
 
మధుమేహంపై అహుజా బజాజ్‌ 8వ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ‘‘ఆధునిక జీవనశైలి కారణంగా పుట్టుకొచ్చిన మధుమేహాన్ని డాక్టర్లు, పరిశోధకులు ‘అవకాశవాద మృత్యువు’గా అభివర్ణిస్తున్నారు. ఇది జీవితాంతం వెంటాడే రోగం. దీనికోసం వాడే మందులు, ఇన్సులిన్లు దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలు కూడా దీనిబారిన పడుతున్నారు. అందుబాటు ధరల్లో వైద్యసౌకర్యాలు లేకపోవడం, అవగాహన కొరవడటం వల్ల ఇది ముదిరిపోయే వరకు సమస్యను గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
 
 
అందువల్ల ప్రభుత్వాలు మ‌ధుమేహ చికిత్సలకు, మందులకు రాయితీలు ఇవ్వాల‌ని సీజె సూచించారు.  నేను కూడా ఒత్తిడితో కూడిన ఈ న్యాయవృత్తిని కాకుండా మరోదైనా వృత్తిని ఎంచుకొని ఉంటే, దీని చికిత్స కోసం డాక్టర్లను ఒత్తిడి చేసే పని ఉండేది కాదేమోన‌న్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారమంతా పాశ్చాత్య దేశాల పరిశోధనల ఆధారంగా రూపొందించిందేన‌ని, అందువల్ల భారత పరిస్థితులపై దృష్టి సారించి అధ్యయనాలు చేయాల‌న్నారు.


ఇప్పటికీ మనం రక్తంలో గ్లూకోజు స్థాయిని ప్రామాణీకరించలేకపోవడం దురదృష్టకరమ‌ని, ఆధునిక మందులు కనిపెట్టి ఈ రోగాన్ని నివారించేందుకు ప్రయత్నించాల‌న్నారు. గత 30 ఏళ్లుగా తాను ఒకే మందే వాడుతున్నాన‌ని, దీన్ని సంపూర్ణంగా నియంత్రించే విధానం రావాలన్నదే త‌న ఆకాంక్ష అని జస్టిస్‌ రమణ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు