హిందూపురం లోక్‌సభ బరిలో పరిపూర్ణానంద స్వామి!!

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (16:35 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అలాగే, హిందూపురం అసెంబ్లీ స్థానానికి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పనిలోపనిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు గుప్పించారు. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, హిందూపురం లోక్‌సభ స్థానం అభ్యర్థిగా బీజేపీ పెద్దలు తన పేరును ఖరారు చేశారని, అయితే, తనకు టిక్కెట్ రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని తెలిపారు. కూటమిలో భాగంగా, మైనార్టీ ఓట్లు ఎక్కడ పడవో అనే అనుమానంతో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టామని, ప్రజలు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. 
 
సౌత్ ఇండియాలో హిందూపురానిది గొప్ప స్థానమన్నారు. హిందూపురం పేరులోనే హిందూ ఉందని, అందుకే హిందూపురం పార్లమెంట్, హిందూపురం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే, హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున సినీ నటుడు బాలకృష్ణ, లోక్‌సభ అభ్యర్థిగా బీకే పార్థసారథి పేర్లను చంద్రబాబు ఖరారు చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు