ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదు... అసలు సాధ్యమే కాదు : టీడీపీ ఎంపీలు టీజీ - అవంతి

సోమవారం, 30 జనవరి 2017 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానే రాదు కదా.. అసలు సాధ్యమే కాదనీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు టీజీ వెంకటేష్, అవంతి శ్రీనివాస్‌లు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీ మాత్రమే సాధ్యమన్నారు. లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఎక్కువగా ఉండడం వల్లే ప్యాకేజీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఏపీకి సరిపడా ప్యాకేజీ తప్పక సాధిస్తామని, ఒకవేళ సరిపడా ప్యాకేజీ అందకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదని ఎంపీ స్పష్టం చేశారు.
 
అలాగే, అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేకహోదా రాదని మేము నమ్ముతున్నామని, ఈ విషయాన్ని కేంద్రం ఎప్పుడో స్పష్టం చేసిందని చెప్పారు. అందువల్లే రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత కావాలని కోరుతున్నామన్నారు. ఏపీ ప్రయోజనాలకు ఇబ్బంది లేనంత వరకు కేంద్రానికి మద్దతిస్తామని, తేడా వస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి