గురువు కాదు కీచకుడు... విద్యార్థినిపై హెడ్మాస్టర్ అత్యాచారం.. భార్య సహకారం

ఆదివారం, 24 నవంబరు 2019 (11:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ హెడ్మాస్టర్ కీచకుడిగా మారిపోయాడు. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ కామాంధుడుకి ఆయన భార్య కూడా సహకరించడం గమనార్హం. చివరకు అతని వేధింపులు భరించలేని విద్యార్థిని షీ బృందాన్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని జానెట్ జార్జ్ మెమోరియల్ స్కూలుతో పాటు అనుబంధ వసతిగృహం కూడా ఉంది. ఇది యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ ఇండియా (యూసీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ 24 మంది బాలికలు, 76 మంది బాలురు ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్నారు. 
 
అయితే, విజయవాడకు చెందిన కలవెంటి ప్రసాదరావు (51) ప్రధానోపాధ్యాయుడిగా, వసతి గృహం ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక (14)పై కన్నేసిన ప్రసాదరావు ఆమెను బెదిరించి వసతి గృహంలోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం తెలిసినప్పటికీ భార్య వారించకపోగా, అతడికి సహకారం అందించింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయాడు. ఏడాదిపాటు బాలికపై అతడు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయింది.
 
ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో తన అమ్మమ్మ వద్దకు వెళ్లిపోయిన బాలిక.. ఇటీవల టీసీ కోసం స్కూలుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు తనపై జరిపిన దాష్టీకంపై స్నేహితురాలికి చెప్పుకుని బోరున విలపించింది. వారి సాయంతో షీటీం, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు హెచ్ఎంతో పాటు అతని భార్యను కూడా అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు