తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌కి కరోనా.. ఏపీలో కొత్తగా 3963 కేసులు

ఆదివారం, 19 జులై 2020 (15:15 IST)
Tenali MLA
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 
 
జలుబు రావటంతో ముందు జాగ్రత్తగా శనివారం కరోనా పరీక్ష చేయించుకున్నట్లు శివకుమార్ తెలిపారు. వారి కుటుంబంలో అందరికి పరీక్ష చేయగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. చికిత్స తీసుకుంటున్నానని.. నియోజకవర్గంలో ప్రజలు అధైర్యపడొద్దు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తానని ఎమ్మెల్యే శివకుమార్‌ తెలిపారు.
 
ఏపీలో 3963 కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 589కు చేరిందని ప్రభుత్వం శనివారం బులిటెన్ విడుదల చేసింది. 
 
తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 3, విశాఖలో 2, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు