కరోనా విజృంభణ.. తమిళనాడులో సీనియర్ మంత్రికి పాజిటివ్

శనివారం, 11 జులై 2020 (13:05 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా పెద్దా, పేద, ధనిక తేడా లేకుండా కరోనా సోకుతోంది. తాజాగా తమిళనాడులో ప్రజా ప్రతినిధులను సైతం కరోనా వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఆ వైరస్‌ బారిన పడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం మరో సీనియర్‌ మంత్రికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. పక్షం రోజులకు ముందు ఆ మంత్రి సతీమణికి కరోనా వైరస్‌ సోకింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్న తరుణంలో మంత్రికి పాజిటివ్‌ లక్షణాలున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 
 
గత మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని సదరు మంత్రి తెలపటంతో ముఖ్యమంత్రి షాక్‌ అయ్యారు. తాజాగా కరోనా బారినపడిన మంత్రి మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి నిబంధనలను పాటించినప్పటికీ వైరస్‌ బారిన పడటం గమనార్హం. 
 
ఇదిలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆ మంత్రికి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలు కుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ విధులకు హాజరుకావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్టాలిన్‌ పేర్కొన్నారు.
 
సచివాలయం రెండు రోజులపాటు మూతపడనుంది. కరోనా నిరోధక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు నెలలో రెండు, నాలుగో శనివారాల్లో మూసివేయాలని ఇదివరకే ప్రకటించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంతాలను శానిటైజ్ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు