అమరావతి రాజధానిని నాశనం చేస్తున్నారు: ఎమ్మెల్యే గద్దె రామమోహ‌న్‌

శనివారం, 4 జులై 2020 (22:01 IST)
ముఖ్యమంత్రి జగన్ రాక్షస మనస్తత్వంతో అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ విమర్శించారు.

శనివారం అశోక్‌నగర్‌లోని త‌న కార్యాలయంలో 200 రోజులుగా జరుగుతున్న అమరావతి రాజధాని ఉద్యమానికి సంఘీభావంగా గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ అభ్యర్థులు నిరస‌న దీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా గద్దె  మట్లాడూతూ అమరావతి రాజధానికి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతులు 34,000 ఎకరాలు త్యాగం చేస్తే, ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా చెయ్యాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు.

చంద్రబాబు నాయుడు అమరావతికి ప్రపంచ పటంలో గుర్తింపు తెస్తే, జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ప్రపంచపటం నుంచి తుడిచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గద్దె రామమోహన్ తెలిపారు.

అమరావతి చుట్టు ప్రక్కల 29 గ్రామాల రైతులు రాజధానికి పొలాలు ఇచ్చి, 200 రోజుల నుంచి కోర్టులు చుట్టూ, పోలీస్ స్టేషన్లు చుట్టు తిరుగుతున్నారని గద్దె రామమోహన్ తెలిపారు. 66 మంది రైతులు ఈ ద్యమంలో అశువులు బాసినా, 200 రోజులైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడుపుతున్న రైతు సోదరులకు శాల్యూట్ చేస్తున్నానని గద్దె  తెలిపారు. భారతదేశంలో రాజధాని లేని నగరంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు.

ఏ రాష్ట్రంలోనైతే రైతులు నష్టపోయి, రైతులు కన్నీరు పెడతారో ఆ రాష్ట్రం బాగుపడిన దాఖలాలు లేవని గద్దె తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆకలి కేకలు వింటున్నామని, రాజధాని విషయంలో రైతులకు ప్రభుత్వం చేసిన అన్యాయమే కారణమన్నారు.

కరోనాతో ప్రపంచం అంతా భయపడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం చులకనగా మాట్లాడుతున్నారని, ఈ ప్రభుత్వంలో కరోనాకు సరైన వైద్యం లేదని, తగిన చర్యలు లేవని, ఎవరకివారు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని అంటూ చేతులెత్తేశారని గద్దె రామమోహన్ విమర్శించారు.

ముఖ్యంగా అమరావతి రాజధాని వల్ల విజయవాడ నగరం గత ప్రభుత్వంలో బాగా అభివృద్ధి చెందిందని, వేలాది మంది కార్మికులకు పని దొరికిందని, హుటల్స్ వారు, వ్యాపారస్తులు చిన్న చిన్న టిఫిన్ బళ్ల వారు కూడా మంచి జీవనం సాగించారని, ఆటోలు, ప్రైవేట్ వాహనాల వారికి ఖాళి లేని పరిస్థితి ఉండేదని ప్రస్తుతం అందరూ వ్యాపారాలు లేక, పనులు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.

భవిష్యత్తులో అమరావతి రాజధాని ఉద్యమంపై ఏ నిర్ణయలు తీసుకున్నా తూర్పు నియోజకవర్గం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కళ్లు తెరవాలని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని గద్దె డిమాండ్ చేశారు. 

మాజీ జిల్లా ఛైర్ పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అమరావతి రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పాడు, ఎందుకు మడం తిప్పాడని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల మనోభావాలను గౌరవించాలని, వారు అభిష్టానికి అనుకూలంగా పనిచేయాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు.

అమరావతి ఉద్యమం రాష్ట్ర ప్రజలందరిదని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు అందరూ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది రైతులకు 2 నిమిషాలు పాటు మౌనం పాటించి నివాళుల‌ర్పించారు.

కార్యక్రమంలో చెన్నుపాటి గాంధి, జాస్తి సాంబశివరావు, షేక్ ఫిరోజ్, రత్నం రమేష్, దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, పోలిపిల్లి ముని, పోట్లూరి సాయిబాబు, నందిపాటి దేవానంద్, అప్పరబోతు రాము,  పలువురు కార్పొరేటర్ అభ్యర్థులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు