ఎన్ ఆర్ ఐల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: బుచ్చిరామ్ ప్రసాద్

మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:24 IST)
ఏపీకి చెందిన ఎన్ ఆర్ఐ ల సంక్షేమం కోసం, వారినుంచి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకోసం, రాష్ట్రభవిష్యత్ కోసం వారు నిర్వర్తించాల్సిన విధులదృష్ట్యా, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకం గా  ఏపీఎన్ ఆర్టీ విభాగాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఏర్పాటుచేశారని, అందులో భాగంగా గల్ఫ్ దేశాల్లోని ఎన్ ఆర్ఐల సంక్షేమం, సమస్యల పరిష్కారంకోసం రూ.150తో ఇన్సూరెన్స్ పథకాన్ని అమలుచేశారని టీడీపీనేత, ఇండో-అమెరికన్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు.

ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ ఆర్ ఐలు ప్రమాదం బారిన పడితే రూ.లక్ష, రూ. ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10లక్షలు, అక్కడ వారికిఏదైనా న్యాయసమస్యులు తలెత్తితే రూ.50వేలవరకు అందేలా పథకాన్ని అమలుచేశారన్నారు.  ఏపీ ఎన్ ఆర్టీ విభాగం కింద, టీడీపీ హాయాంలో ఇమ్మిగ్రేషన్, ఇతరసమస్యలతో బాధపడేవారిలో 900 మందిని స్వదేశాలకు తరలించడం కూడా జరిగిందన్నారు.

దుబాయ్, తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధికోసం బాధపడేవారికి శిక్షణ ఇప్పించడంకోసం చంద్రబాబు ప్రభుత్వం రెండు శిక్షణకేంద్రాలు కూడా నిర్వహించిందన్నారు. మనరాష్ట్రంనుంచి ఉపాధికోసం విదేశాలకు వెళ్లేవారికి మంచి వేతనం లభించేలా, వారికి శిక్షణ అందించేలా సదరు కేంద్రాలను నడపడం జరిగిందన్నారు. వాటిద్వారా దాదాపు 900మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా ఆనాటి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 

ఏపీ ఎన్ ఆర్ టీ విభాగం కోసం ఆనాటి టీడీపీ ప్రభుత్వం 4ఎకరాల భూమిని అమరావతిలో కేటాయించడం జరిగిందన్నారు. ఆభూమిలో ఐకాన్ టవర్స్ మాదిరి రెసిడెన్షియల్, కార్యాలయాలు ఉండేలా భారీనిర్మాణాలను ప్లాన్ చేయడం జరిగిందన్నారు.  సదరు నిర్మాణాలకు కొందరు ఎన్ ఆర్ఐలు పెట్టుబడి కూడా పెట్టడంజరిగిందన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్నవారు, ఇప్పుడు ఉపసంహరించుకున్నారన్నారు.

ఎన్ ఆర్ ఐలకోసం 24గంటలుపనిచేసేలా టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన కాల్ సెంటర్, పోలీస్ సెల్ విభాగాలు కూడా మూతపడ్డాయన్నారు. ఏపీ ఎన్ ఆర్టీ అనేది ప్రభుత్వ సంస్థ అని, అదిప్రైవేట్ విభాగం కాదన్నారు. హ్యపీ నెస్ట్ ప్రాజెక్ట్ కింద ప్లాట్లు కొనుగోలుచేసిన ఎన్ ఆర్ ఐలు కూడా వైసీపీప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్లాట్లను అభివృద్ధిచేసి తిరిగివ్వకుండా, అక్కడ నిర్మాణాలు చేయకుండా ఎన్న ఆర్ఐలను వేధిస్తోందన్నారు.    
 
ఇప్పుడున్న ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్ టీపై ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు రూ.150లతో అమలుచేసిన ఇన్సూరెన్స్ కి, జగన్ ప్రభుత్వం రూ.450వరకు వసూలుచేస్తోందన్నారు. చంద్రబాబుప్రభుత్వం నిర్వహించిన శిక్షణకేంద్రాలు ఏమయ్యాయో కూడా తెలియడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల సంక్షేమంపై దృష్టిపెట్టకపోవడంతో, వారిద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు కూడా రావడం లేదన్నారు. 

రోజూ 50 మంది ఎన్ ఆర్ ఐలకు తిరుమలస్వామివారి దర్శన భాగ్యం కలిగేలా గతప్రభుత్వం నిర్వహించిన బ్రేక్ దర్శన సేవలను కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. విదేశాల్లో నివసించే రాష్ట్రవాసుల  సమస్యలను ఏపీప్రభుత్వం అసలు పట్టించుకోవడమే మానేసిందని బుచ్చిరామ్ ప్రసాద్ వాపోయారు.

ఏపీ ఎన్ ఆర్ఐలు రూ.48కోట్ల వరకు  అమరావతిలో నిర్మించాలనుకున్న ఐకాన్ టవర్స్ లో పెట్టుబడి పెట్టడంజరిగిందని, ఆసొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం వెనక్కు ఇవ్వడం లేదని రామ్ ప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వతీరుని నిరసిస్తూ, కొందరు ఎన్ ఆర్ఐలు న్యాయస్థానాలను ఆశ్రయించారని, మూడునెలలుగా సదరు అంశాలు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని, విలేకరులు అడిగినప్రశ్నకు సమాధానం గా రామ్ ప్రసాద్ చెప్పారు.

తమకున్న సమస్యలపై కేంద్రపెద్దలను కలిసే కూడా యోచనలో ఎన్ఆర్ ఐలు ఉన్నాయన్నారు.  ఎన్ఆర్ ఐలు తమ సొంతపెట్టుబడులతో కేరళలో ఒక విమానాశ్రయాన్నే నిర్మించారని, అదేవిధంగా ఏపీలో కూడా చేయాలనే ఆలోచనను వారు ఇదివరకున్న ప్రభుత్వంతో చెప్పడం జరిగిందన్నారు.

రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా ఏపీఎన్ ఆర్టీపై సమీక్ష నిర్వహించి ఎన్ ఆర్ ఐల సమస్యలు పరిష్కరించాలని, వారిపెట్టుబడులు, సేవలతో రాష్ట్రాన్ని అభివృద్ధిచేసుకునే దిశగా ఆలోచనచేయాలని బుచ్చిరామ్ ప్రసాద్ పత్రికాముఖంగా పాలకులకు విజ్ఞప్తిచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు